HomeNewsహైదరాబాద్ లో మహిళలపై పెరుగుతున్న నేరాలు

హైదరాబాద్ లో మహిళలపై పెరుగుతున్న నేరాలు

Published on

గ్లోబల్ నగరంగా మారుతున్న హైదరాబాద్ మహా నగరంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలి కాలంలో వరుస ఘటనలతో మహిళలు భయాందోళనకు గురవుతున్నారు. నెల వ్యవధిలోనే మహిళలు, బాలికలపై పలు దాడులు, హత్య, అత్యాచారాలు ఘటనలు నమోదవ్వడం ఆందోళన రేకెత్తుస్తుంది. ఇటీవల హుమాయన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చెవిటి, మూగ మహిళపై అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఇంట్లో ఎవరు లేని సమయాన్ని చూసి బాధితీరాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. విజయనగర్ కాలనీలో నివాసం ఉండే బాధిత మహిళను అదే ప్రాంతంలో ఉండే సాయి అనే వ్యక్తి బాత్రూంలో బంధించి అత్యాచారం చేశాడు. బాధిత మహిళ మూగది కావడంతో రక్షించమని అరవడానికి కూడా కుదరలేదు. అనంతరం బాధిత మహిళ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. నిందితుడ్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఇక స్వాతంత్ర దినోత్సవం నాడు పోలీసులే నగరంలోనే గిరిజన మహిళ పై థర్డ్ డిగ్రీ ప్రయోగించడంపై ఇప్పటికీ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఘటనను మహిళ సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇంత జరుగుతుంటే ప్రభుత్వం ఏంచేస్తోందని మండిపడుతున్నాయి. రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ సైతం ఈ ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేసి.. ఇన్సిడెంట్‌పై పూర్తి వివరాలు ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ కేసులో ఇద్దరు కానిస్టేబుల్స్‌ను సస్పెండ్ చేసిన అధికారులు.. మరొక ఎస్సైపై బదిలీ వేటు వేశారు. ఇక యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసినటువంటి ఘటన జవహర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళను నిలువరించి.. బెదిరించి వివస్త్రను చెశాడు. దీంతో బయట అడుగు పెట్టాలి అంటేనే భయంగా ఉందంటున్నారు కొందరు మహిళలు. ఈ ఘటనలు మరవకముందే జగద్గిరిగుట్ట,పేట్ బషీరాబాద్‌‌లో బాలికలపై అత్యాచార ఘటనలు వెలుగుచూడడం నేరస్తుల విచ్చలవిడి తనానికి నిదర్శనం అంటున్నారు.

నగరంలోని సూరారంలో ఇంటి నుండి బయటకు వచ్చిన మహిళ హత్యకు గురి అయింది. అటు శంషాబాద్‌లో మహిళను పెట్రోల్ పోసి నిప్పు అంటించిన ఘటన ఆందోళన కలిగిస్తోంది. అంతేకాదు, మీర్‌పేట్‌లో బాలికపై సామూహిక అత్యాచారం లాంటి భయంకరమైన, దారుణమైన ఘటనలు మహిళల్ని భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఖాళీ ప్రదేశాలు, నిర్మానుష్యమైన ప్రాంతాలు, రోడ్లపై.. పోలీసులు మరింత ఫోకస్ పెట్టాలని మహిళలు, ప్రజలు కోరుతున్నారు. గస్తీ పెంచడంతో పాటు నేరస్థులకు కఠిన శిక్షలు వేయడం ద్వారా కొంతమేర మహిళలపై నేరాలకు అడ్డుకట్ట వేయొచ్చని చెబుతున్నారు. అంతే కాకుండా మహిళలపై దారుణమైన నేరాలకు పాల్పడేవారికి.. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా త్వరితగతిన శిక్ష పడేలా చూడాలని కోరుతున్నారు.అంతేకాదు ఇలాంటి ఘోరమయిన నేరాలకు పాల్పడినవారికి ఉరిశిక్ష విధించాలని ఆగ్రహంతో డిమాండ్ చేస్తున్నారు మహిళలు. హైదరాబాద్, చుట్టుపక్కల ఉన్న శివారు ప్రాంతాలను సేఫ్ జోన్ లుగా మార్చాలని కోరుతున్నారు ప్రజలు

Latest articles

More like this