HomeNewsభూకబ్జా ఆరోపణలపై మల్లారెడ్డి స్పందన.. అర్థరాత్రి రిజిస్ట్రేషన్ చేశారంటున్న బాధితుడు

భూకబ్జా ఆరోపణలపై మల్లారెడ్డి స్పందన.. అర్థరాత్రి రిజిస్ట్రేషన్ చేశారంటున్న బాధితుడు

Published on

తనపై వచ్చిన భూకబ్జా ఆరోపణలపై మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి స్పందించారు. భూ కబ్జాతో తనకు ఎటువంటి సంబంధం లేదని, కేసు నమోదైన విషయం వాస్తవమేనని అన్నారు. అయితే ఇది ప్రభుత్వ కక్ష సాధింపు ఉందని తాను భావించడం లేదన్నారు. దీనిపై కోర్టును ఆశ్రయిస్తానని మల్లారెడ్డి స్పష్టం చేశారు. గిరిజనుల భూములు కబ్జా చేశారని ఫిర్యాదు రావడంతో శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో మల్లారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదయ్యింది. దీనిపై మల్లారెడ్డి స్పందించారు. 47 ఎకరాలు కబ్జా చేశారని ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో రాత్రికి రాత్రి రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఎంఆర్‌వోతోపాటు మల్లారెడ్డిపై ఫిర్యాదు రావడంతో నాలుగు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. మల్లారెడ్డితో పాటు అతని అనుచరులు 9 మందిపై 420 చీటింగ్, ఎస్సీ, ఎస్టీ చట్టాల కింద కేసులు నమోదు చేశారు.

శామీర్‌పేట్ పోలీస్ ఇన్స్‌పెక్టర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. మేడ్చల్ మల్కాజిరి జిల్లా మూడు చింతలపల్లి మండలంలోని కేశవరం గ్రామంలోని సర్వేనెంబర్ 33, 34, 35లో గల 47 ఎకరాల 18 గుటల ఎస్టీ (లంబాడీల) వారసత్వ భూమిని మాజీ మంత్రి మల్లారెడ్డి, అతని బినామీ అనుచరులు 9 మంది అక్రమంగా కబ్జా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కుట్రతో మోసగించి భూమిని కాజేశారని శామీర్‌పేట పోలీస్టేషన్‌లో ఫిర్యాదు నమోదు అయ్యింది. విచారణ చేపట్టిన పోలీసులు మాజీ మంత్రి, అతని అనుచరులు, మల్లారెడ్డి బంధువు శ్రీనివాస్ రెడ్డి, కేశవాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ భర్త గోనె హరి మోహన్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా (డిసిఏంఎస్)జిల్లా సహకార సంఘం వైస్ చైర్మన్ శామీర్‌పేట్ మండల వ్యవసాయ సహకార సేవా సంఘం చైర్మన్ రామిడి మధుకర్ రెడ్డి శివుడు, స్నేహ రామిరెడ్డి, రామిడి లక్ష్మమ్మ, రామిడి నేహా రెడ్డిలపై శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ 420 చీటీంగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎన్నికలకు ముందు రాత్రి 11 గంటల టైంలో శామీర్ పేట తాహశీల్దార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. మంత్రికి అండగా ఉండి తమతో రాత్రి వేళ భూమి రిజిస్ట్రేషన్ చేయించిన తాహశీల్దార్ పైన కేసులు నమోదుచేయాలని బాధితుడు భిక్షపతి నాయక్ డిమాండ్ చేస్తున్నారు. తమకు తెలియకుండ 47 ఎకరాల 18 గుంటల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించిన ఉదంతపై విచారణ జరపాలని, 250 కోట్లు విలువైన తమ భూమిని తనకు అప్పగించేలా చూడాలని భిక్షపతినాయక్ పోలీసులను కోరుతున్నారు. తనను మోసం చేసిన ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి, అతని 9మంది అనుచరులను కఠినంగా శిక్షించాలని బాధితుడు ప్రభుత్వాన్ని కోరుతున్నాడు.

Latest articles

More like this