HomeNewsAndhra Pradeshతెలంగాణ ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరం

తెలంగాణ ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరం

Published on

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయించుకుంది. స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేసులో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్టు, వైసీపీ సర్కారుపై పూర్తి స్థాయిలో పోరాడుతున్న నేపథ్యంలో.. ఇప్పుడు తెలంగాణ ఎన్నికలపై దృష్టి సారించలేమని భావిస్తోంది. ఈ విషయాన్ని టీ-టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌కు చంద్రబాబు విడమరచి చెప్పినట్లు తెలిసింది.

శనివారం రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో చంద్రబాబుతో కాసాని ములాఖత్‌ అయ్యారు. తెలంగాణ ఎన్నికల బరిలో నిలవాలని తాము కోరుకుంటున్నామని, పోటీకి అనుమతించాలని కోరారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ… ‘‘ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం తెలంగాణపై ఫోకస్‌ పెట్టలేం. దిగితే పూర్తి స్థాయిలో యుద్ధం చేయాలి. ఇప్పుడు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో మీరంతా చూస్తున్నారు. వచ్చే మే నెలలో ఏపీ ఎన్నికలు జరగబోతున్నాయి.

పూర్తి శక్తియుక్తులు కేటాయించి ఇక్కడ ఎన్నికల్లో పోరాడి ఫలితం సాధించాలి. ఏపీలో విజయం సాధిస్తే తర్వాత తెలంగాణలో కూడా పార్టీ బలం పుంజుకుంటుంది. ఆషామాషీగా పోటీ చేసి సరైన ఫలితం రాలేదని బాధపడే బదులు దూరంగా ఉండటమే మంచిది. ఈ విషయాలపై మీరూ ఆలోచన చేయండి. అవసరమైతే మనం మరోసారి చర్చిద్దాం’’ అని తెలిపినట్లు సమాచారం. మరోవైపు కాంగ్రెస్ కు మేలు చేసేందుకే పార్టీ ఎన్నికల నుంచి దూరం అయిందని టీడీపీపై విమర్శలు వస్తున్నాయి. గతంలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని కాసాని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజా నిర్ణయంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Latest articles

More like this